హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై మూడు కార్లు ఢీ

నాగర్‌కర్నూల్ జిల్లా, హైదరాబాద్, శ్రీశైలం ప్రధాన రహదారిపై శనివారం మూడు కార్లు ఢీకొన్న ఘటనలో ఒకరు మరణించారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన కొంత మంది యాత్రికులు శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో స్వగ్రామం వెళ్తున్నారు. వీరంతా రెండు కార్లలో బయల్దేరాగా, అచ్చంపేట మండలం, హాజీపూర్ సమీపంలోని శ్రీశైలం ప్రధాన రహదారిపై హైదరాబాద్ నుండి ఎదురుగా వస్తున్న ఇన్నోవా కారు బలంగా వీరి కార్లను ఢీకొట్టింది. దీంతో కర్ణాటక రాష్ట్రానికి చెందిన భక్తుల కార్లు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నాయి.

ఇన్నోవా కారులో బిలాల్ (28) అనే వ్యక్తి తన అన్నతో కలిసి రంగాపూర్ నిరంజన్ షావలి దర్గా ఉర్సు వేడుకలను తిలకించేందుకు వస్తున్నారు. ప్రమాదంలో బిలాల్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మరణించాడు. కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన విష్ణుకాంత్, విజయలక్ష్మి, వాసవి, మంజు, జగదీశ్‌తో పాటు మరికొంతమంది ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వారిని చికిత్స కోసం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేష్ తెలిపారు.



from Mana Telangana https://ift.tt/LqjECRB

Post a Comment

Previous Post Next Post

Below Post Ad