వరదల్లో నిండా మునిగిన రైతాంగాన్ని వంచనతో మళ్లీ ముంచారు:కెటిఆర్

KTR

వరదల్లో నిండా మునిగిన రైతాంగాన్ని సర్కార్ వంచనతో మళ్లీ ముంచిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. రైతులకు పరిహారమా..? పరిహాసమా..? అని ఎక్స్ వేదికగా కెటిఆర్ ప్రశ్నించారు. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే, వేల ఎకరాలకే అరకొర సాయం చేసి చేతులు దులుపుకోవడం అన్యాయమని అన్నారు. 4. 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన మాటలు, వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదిక వాస్తవం కాదా…? అని అడిగారు. పంట నష్టం అంచనాలను తలకిందులుగా ఎందుకు మార్చేశారని, ఏకంగా 3 లక్షల 35 వేల ఎకరాలు ఎలా ఎగిరిపోయాయని విమర్శించారు.

79, 574 ఎకరాలకే కంటి తుడుపుగా పరిహారం ఇచ్చి మమ అనిపించడం దారుణమని ఆరోపించారు. అపార నష్టంతో అల్లాడుతున్న రైతులను ఆదుకునే విషయంలోనూ ఉదారంగా వ్యవహరించలేరా..? మానవత్వం ప్రదర్శించలేరా..? అని ప్రశ్నించారు. 5.20 లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిందని కేంద్ర బృందానికి రాష్ట్రం నివేదిక ఇచ్చింది నిజం కాదా..? ఇప్పుడు ఇంత భారీ కోతలా అంటూ కెటిఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్నదాత ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం ప్రభుత్వాల బాధ్యత అని, ఆ బాధ్యత నుంచి తప్పించుకోకుండా నష్టం వాటిల్లిన ప్రతి ఎకరానికి పరిహారం అందించాలని కోరారు. రుణమాఫీలో దగా జరిగింది, రైతుభరోసా జాడ పత్తా లేదు.. వరదలు ముంచెత్తి నష్టాల్లో, కష్టాల్లో కూరుకుపోయిన రైతులకు అండగా నిలవట్లేదు అంటూ ధ్వజమెత్తారు. అన్నదాతపై ఎందుకీ వివక్ష..? అని కెటిఆర్ ప్రశ్నించారు.



from Mana Telangana https://ift.tt/CuhNjSW

Post a Comment

Previous Post Next Post

Below Post Ad